డమరుకం విడుదల కావాలంటే శివుడు రంగంలోకి దిగాలా...? చూస్తుంటే పరిస్థితి అలానే ఉన్నట్లుంది. అసలు సంగతి ఏంటయా అంటే... డమరుకం మళ్లీ వాయిదా పడింది. నవంబరు 10న సినిమా విడుదలవుతుందని, థియేటర్లు కూడా సిద్ధం చేస్కున్న డిస్ట్రిబ్యూటర్లకు నిరాశ ఎదురయింది. అంతకుమించి అశేష నాగార్జున అభిమానులు తీవ్ర అసహనాన్ని కోపాన్ని వ్యక్తపరిచారు. పదేపదే చిత్రం వాయిదా పడటంపై వారు మండిపడ్డారు.అభిమానుల ఆవేశాన్ని తగ్గించేందుకు నాగార్జున నేరుగా రంగంలోకి దిగారు. డమరుకం విడుదలకు శివుడు ఆజ్ఞ రాలేదనీ, పరమేశ్వరునికి పూజలు చేయండంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. నాగార్జున ఇచ్చిన పిలుపుకు అభిమానులు కేరింతలు కొట్టినా పలు సినిమా థియేటర్లపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు.
అసలు డమరుకం విడుదల కాకపోవడం వెనుక వేరే స్టోరీ నడుస్తోందని ఫిలిమ్ వర్గాలు చెపుతున్నాయి. చిత్ర నిర్మాత పలువురుకు అప్పు పడ్డారనీ, ఆ అప్పు తమకు చెల్లించనిదే బాక్సులు కదలనివ్వబోమనీ నిన్న రాత్రి పలువురు ఫైనాన్షియర్లు ప్రసాద్ ల్యాబులో హంగామా చేశారట. దాంతో నిర్మాతకు ఏం చేయాలో తెలియక చేతులెత్తేసినట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ డమరుకం విడుదల కావాలంటే శివుడే రంగంలోకి దిగాలేమో..?!!







